అధిక లాభాల ఆశ చూపి రూ.98.66 కోట్ల పెట్టుబడుల మోసం* ఇద్దరు అరెస్టు*
-
- ల్యాప్టాప్లు, కారు స్వాధీనం*
- ల్యాప్టాప్లు, కారు స్వాధీనం*
కాకినాడ, జూలై 10: (జిఎస్ బి వార్త)
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తామని, ప్రతి నెల స్థిరమైన లాభాలు అందిస్తామని నమ్మబలికి కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించి ప్రజలను మోసం చేసిన కేసులో ఇద్దరిని సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు.
కాకినాడ నగరంలోని జిల్లా క్రీడా మైదానం ఎదురుగా ఉన్న కేఆర్కే ప్లాజాలో ‘ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ 2023 జూలై నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లా ఎస్పీ జి బింధు మాధవ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం కిశోర్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు నిర్వహించి ప్రధాన నిందితులు పులుగు మోజేష్ (సంస్థ మేనేజింగ్ డైరెక్టర్), సంధనా లలిత అంబిక (డైరెక్టర్)లను అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి ఆరు ల్యాప్టాప్లు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కారు, బాండ్లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో మొత్తం 7,342 పెట్టుబడుల ద్వారా రూ.98.66 కోట్లకు పైగా సేకరించినట్లు గుర్తించారు. ఇందులో 3,633 పెట్టుబడులు కొనసాగుతుండగా, వాటి విలువ రూ.53.87 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు లాభాలతో కలిపి రూ.16.13 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.37.74 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టు చేసిన నిందితులను కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం కిశోర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
