అయినాపురం సెప్టెంబర్05( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని అయినాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎలిమెంటరీ పాఠశాలల ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
శ్రీ మోకా చంద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ మోకా రామారావు, సెక్రటరీ మోకా శిరీష కుమారి ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం ప్రతి ఉపాధ్యాయుడికి తైవాన్ జామ మొక్కలను అందజేశారు.
గత ఏడు సంవత్సరాలుగా మోకా చంద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయినాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువులను సన్మానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ మోకా రామారావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి ఒకటని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమని పేర్కొన్నారు.
గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉపాధ్యాయులను సన్మానించడంతో పాటు మొక్కలను అందించడం ద్వారా గురువులకు గౌరవం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత అనే రెండు మంచి సందేశాలను సమాజానికి అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

