*డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి* : 
*వైకాపా ఉద్యోగ పెన్షనర్స్ విభాగ రాష్ట్ర కార్యదర్శి పిల్లి రామారావు డిమాండ్*
కాకినాడ సిటీ ఆగస్టు 5 జి ఎస్ బి వార్త
రాష్ట్రంలో 2025 మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైకాపా ఉద్యోగ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఇంజనీర్ పిల్లి రామారావు డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లి రామారావు మాట్లాడుతూపరీక్షల నిర్వహణ నుండి ఫలితాల ప్రకటన వరకు పారదర్శకత లోపించిందని ఆరోపించారు. సాంకేతిక లోపాలు, అభ్యర్థుల అభ్యంతరాలు, ‘కీ’ వివాదాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.నెలల తరబడి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు ₹3,000 నిరుద్యోగ భృతిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదనకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని పిల్లి రామారావు హెచ్చరించారు.