డ్రగ్స్కు దూరంగా.. క్రీడల వైపు యువత
అమరావతి ఛాంపియన్షిప్ ముగింపులో భారీ అవగాహన ర్యాలీ
తిరుపతి, ఆగస్టు 28(సదా మీకోసం)
యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ముగింపు సందర్భంగా శుక్రవారం తిరుపతిలో భారీ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. “డ్రగ్స్ వద్దు–క్రీడలు ముద్దు”, “డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్” నినాదాలతో సాగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పోలీసు, రెవెన్యూ అధికారులు, శాప్ ప్రతినిధులు, కోచ్లు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు గొప్ప వేదిక
ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజులపాటు అమరావతి ఛాంపియన్షిప్ను విజయవంతంగా నిర్వహించామన్నారు. అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాల్లో జరిగిన పోటీల్లో సుమారు 15 వేల మంది క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారని తెలిపారు. పాల్గొన్న వారిలో 65 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలకు చెందినవారు కాగా, 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనన్నారు. గ్రామీణ ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలిచాయని పేర్కొన్నారు.
12 వేల మందికి పరీక్షలు.. 430 మందికి పాజిటివ్
ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గంజాయి వినియోగంపై నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు ప్రత్యేక ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో సుమారు 12 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 430 మందికి గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. వీరిలో 350 మందికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు ఉన్నట్లు గుర్తించామని, వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు గంజాయి సరఫరా మూలాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
రిపీట్ నేరస్తులపై పీడీ యాక్ట్
గంజాయి వినియోగదారులతో పాటు విక్రేతలు, సరఫరాదారులు, రవాణాదారులపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా తిరుపతి, రేణిగుంటకు గంజాయి చేరుతున్న మార్గాలపై నిఘా ఏర్పాటు చేశామని, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. గంజాయి కేసుల్లో ఇప్పటివరకు సుమారు 275 గంజాయి షీట్లు ఓపెన్ చేశామని, రిపీట్, హ్యాబిచువల్ అఫెండర్లపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
“డ్రగ్స్లో కాదు.. చదువులో మీ శక్తిని చూపండి”
“మీ శక్తిని డ్రగ్స్లో కాదు.. చదువులో చూపించండి. మీ ప్రతిభను చెడు అలవాట్లలో కాదు.. ఎదుగుదలలో చూపించండి. సమయాన్ని మాదకద్రవ్యాలకు కాకుండా క్రీడలకు, లక్ష్య సాధనకు కేటాయించండి” అని ఎస్పీ యువతకు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు వ్యక్తి జీవితంతో పాటు కుటుంబ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. తిరుపతి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగం, శాప్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, ఈగల్ సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులను అభినందించారు.
