ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
*రామచంద్రపురం, జూలై 21:(జిఎస్ బి వార్త)
ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 46 అర్జీలు అందగా, ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూడటంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా పనిచేస్తున్నామని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, కూటమి పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.