పాతఇంజరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తలు
ఐ.పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్బి వార్త రిపోర్టర్ వేణు కాశి): దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) 17వ వర్ధంతి సందర్భంగా ఐ.పోలవరం మండలంలోని పాతఇంజరం పంచాయతీ పరిధిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలను నాయకులు, అభిమానులు స్మరించుకున్నారు.
పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, సామాన్య ప్రజల అభివృద్ధి కోసం వైఎస్సార్ తీసుకున్న అనేక నిర్ణయాలు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలకు చేరువైన ప్రజానాయకుడిగా వైఎస్సార్ ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవితాంతం పనిచేసిన మహానేత వైఎస్సార్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ప్రజాసేవా దృక్పథం, పేదల పట్ల చూపిన ప్రేమ ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూదునూరి సతీష్ రాజు, పెనుమత్స వాసురాజు, కాలే రాజబాబు, కొండేపూడి కృపా వరప్రసాద్, ఎంపీటీసీ మట్టపర్తి శివ, చప్పిడి రమేష్, మోర్తా వీర రాఘవులు, పండు విజయ్, తాళ్లూరి ప్రసాద్, మచ్చ నాగబాబు, పెద్దిరెడ్డి రాంబాబు, చప్పిడి బుజ్జి, పేరాబత్తుల కొండయ్య, తాటిపాక దుర్గాబాబు, గొల్లపల్లి విష్ణు, సూర్యనారాయణ, కన్నీడి సత్తిబాబు, కాశి ధర్మేంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
మహానేత వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.


