ఐ. పోలవరం, సెప్టెంబర్ 5:( జీఎస్ బి వార్త. రిపోర్టర్ వేణు కాశి) గురుపూజోత్సవం సందర్భంగా మురమళ్లలోని శాంతినికేతన్ ప్రాథమిక, హైస్కూల్లో శనివారం గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ శాలువాలతో సత్కరించి, పూలమాలలతో ఘనంగా గౌరవించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. విద్యార్థులకు అక్షరజ్ఞానం అందించడమే కాకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతూ, ఉన్నత భవిష్యత్తు వైపు సరైన మార్గనిర్దేశం చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ఎనలేనివని కొనియాడారు.
విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ, వారి సూచనలు, సలహాలను పాటించి అంకితభావంతో విద్యను అభ్యసించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
అనంతరం శాంతినికేతన్ విద్యాసంస్థల అధినేత గోకవరపు పెదబాబు వెంకటరాజు జన్మదిన వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు.
అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కూడా పాఠశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన శ్రీకృష్ణుడి వేషధారణలు, సంప్రదాయ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత గోకవరపు వెంకటరాజు, వీరభద్రకుమారి, తాతగారు, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
