పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ. పోలవరంలో మెగా రక్తదాన వైద్య శిబిరం
ఐ. పోలవరం, ఆగస్ట్ 30 (జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐ. పోలవరంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ ఐ. పోలవరం కార్యాలయం వద్ద డాక్టర్ జి. విజయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదాన శిబిరంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే అత్యంత గొప్ప మానవతా సేవ అని నిర్వాహకులు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే సహాయం ప్రాణాలను నిలబెట్టేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యువత, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐ. పోలవరం మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. “రక్తదానం చేయండి… ప్రాణదాతలుగా నిలవండి” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.