ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్బి వార్త రిపోర్టర్ వేణు కె): మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు 2025–26 సంవత్సరానికి జి. వేమవరం ఉన్నత పాఠశాల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 10 పాఠశాలలు పోటీపడగా, జి. వేమవరం ఉన్నత పాఠశాల అత్యుత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి 282 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.కె. మెహబూబ్ భాషా, ఏపీసీ మమ్మీ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మట్టపర్తి శ్రీనివాసరావు, పీడీలు జి. కళావతి, ఎ.ఎన్. రాంప్రసాద్ అందుకున్నారు.
అవార్డు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, శాసన మండలి సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బసవ అప్పారావు, జి. వేమవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు పెంట రవి ప్రసాద్ అభినందించారు.
ఎంపీటీసీలు లంకలపల్లి దుర్గారాణి, జ్యోతి నాయుడు, మద్దింశెట్టి పురుషోత్తం, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఈ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం జి. వేమవరం ఉన్నత పాఠశాల క్రీడా రంగంలో సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.

