
కును నిర్వహించడంలో, సకాలంలో శుభ్రపరచడంలో పంచాయతీ సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే కొళాయిల నుండి పచ్చటి రంగుతో కూడిన, మురికి నీరు వస్తోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తాగేందుకు, వంట వండుకునేందుకు ఈ నీటినే వాడాల్సి రావడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.మరోవైపు ఇక్కడ నీటి ఎద్దడి కూడా తీవ్రంగా వేధిస్తోంది. పేటలోనే ట్యాంకు అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం రోజుకు కొన్ని విడతలుగా కలిపి కేవలం 45 నిమిషాల పాటు మాత్రమే నీటిని విడుదల చేస్తుండటంతో బిందెడు నీటి కోసం స్థానికులు యుద్ధాలు చేయాల్సి వస్తోంది. ఏళ్లు మారుతున్నా, ప్రజాప్రతినిధులు మారుతున్నా తమ తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదని మహిళలు ఆక్రోశిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు రకరకాల వాగ్దానాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్తారని, గెలిచిన తర్వాత కనీసం ఇటువైపు ముఖం చాటేసి పత్తా లేకుండా పోతున్నారని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలజీవన్ మిషన్’ పనులు సైతం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించకపోవడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే స్పందించి ఇక్కడి ట్యాంకును శుభ్రం చేయించి, స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని, లేనిపక్షంలో ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని నక్కావారి పేట గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
