ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్ బి వార్త రిపోర్టర్ వేణు): తెలుగు భాష తేట తేనెల మూటలాంటి మధురమైన భాష అని, మాతృభాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మురమళ్ల శాంతినికేతన్ హైస్కూల్ అధినేత, విద్యావేత్త గోకవరపు వెంకటరాజు (పెదబాబు) అన్నారు.
మురమళ్ల శాంతినికేతన్ పాఠశాలలో శనివారం తెలుగు మాతృభాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు భాష విశిష్టత, ప్రాముఖ్యతపై ప్రసంగాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల అధినేత గోకవరపు వెంకటరాజు, ఆయన సతీమణి, పాఠశాల కరస్పాండెంట్ వీరభద్ర కుమారి మాట్లాడుతూ, తెలుగు భాషను ప్రతి ఏడాది ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే కాకుండా తరచూ గుర్తుచేసుకుని, దాని గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం, ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవాలను ప్రతి ఒక్కరూ గుర్తించి నిర్వహించాలని సూచించారు.
తెలుగు భాషకు సమాజంలో ఉన్న ప్రాచుర్యం, ప్రత్యేకత మరే భాషకు లేదన్నారు. తెలుగును నిర్లక్ష్యం చేయడం అంటే కన్నతల్లిని నిర్లక్ష్యం చేసినట్టేనని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుక భాషలో ఇంగ్లీష్ పదాల వినియోగం అధికమవుతుండటం తెలుగు భాషపై ప్రభావం చూపుతోందన్నారు.
ఇంగ్లీష్ మీడియం విద్య ఒకవైపు, మీడియాలో ఇతర భాషా పదాల అనవసర వినియోగం మరోవైపు తెలుగు భాషా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తెలుగును మాట్లాడాలని, మాతృభాషను గౌరవించాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గోకవరపు వీరభద్రయ్య, హెచ్ఎం శ్రీనివాస్, వి.వి. రావు, తెలుగు ఉపాధ్యాయురాలు యామిని, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులు కవితలు, శతక పద్యాలు, సామెతలు, జాతీయాలను చక్కగా ప్రదర్శించారు. తెలుగు భాష విశిష్టత, ప్రాముఖ్యతతో పాటు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. మన మాతృభాష తెలుగును సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
తేట తేనెల మూట.. మన తెలుగు మాట తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: గోకవరపు వెంకటరాజు
Date:
