*దొంగతనం చేసి… చిట్టీ రాసి ఆపై జైలుకు* !
కరపలో ముగ్గురు బంగారం దొంగల అరెస్టు*
కరప (జిఎస్ బి వార్త):
తెలిసిన వారి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి, ఆ తర్వాత మనసు మార్చుకుని దొంగిలించిన సొత్తును తిరిగి ఇచ్చేసిన ముగ్గురు యువకులు ఆఖరికి పోలీసులకు చిక్కారు. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కరప మండల పరిధిలోని రామకంచెనగర్ గ్రామానికి చెందిన నామాల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపార నిమిత్తం జూన్ 23న తిరుపతి వెళ్లారు. జులై 18న తిరిగి వచ్చి చూడగా, ఇంటి ప్రధాన ద్వారం తాళంతో పాటు బెడ్రూమ్లోని లాకర్ పగులగొట్టి ఉంది. అందులోని 67 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మరియు ₹22,000 నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరప ఎస్సై టి. సునీత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. *తీరిన పశ్చాత్తాపం.. దొరికిన నిందితులు* :అయితే, ఆగస్టు 1న దొంగలు తాము దొంగిలించిన సొత్తులో కొన్ని బంగారు ఆభరణాలను నామాల గణేష్ ఇంటి గుమ్మం వద్ద పడేసి వెళ్లారు. “తప్పయింది, ఇందులో ₹20,000 వాడుకున్నాం” అని ఒక చిట్టీలో రాసి అక్కడ ఉంచారు.రహస్య సమాచారం ఆధారంగా ఆగస్టు 5 (బుధవారం) నాడు గొల్లపాలెం – పెనుగుదురు రోడ్డు మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దొంగతనానికి పాల్పడిన రామకంచెనగర్కు చెందిన కవిటి ప్రసాద్ (అలియాస్ మాణిక్యం), ముగ్గు నాగేశ్వరరావు (అలియాస్ నాగేష్), బైలుపాటి మహేష్లను ఎస్సై సునీత అరెస్టు చేశారు.చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. వారి వద్ద నుంచి మిగిలిన చోరీ సొత్తును రికవరీ చేశారు. కేసులో మొత్తం ₹2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని కాకినాడసబ్జైలుకు తరలించారు.
