ఐ.పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్బి వార్త ప్రతినిధి వేణు కాశి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
జనసేన యువ నాయకుడు రాయపురెడ్డి సత్యసిద్ధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ నాయకులు రాయపురెడ్డి రాజా, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్ల విష్ణు, జనసేన పార్టీ నాయకురాలు ముత్యాల జయలక్ష్మి తదితరులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పుట్టినరోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జనసైనికుడు రాయపురెడ్డి సత్యసిద్ధును ప్రత్యేకంగా అభినందించారు.
పరిసర ప్రాంతాలకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సహస్ర బ్లడ్ సెంటర్ సిబ్బంది రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు.
రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని సేవా స్ఫూర్తితో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం బాణాపురం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.



