ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు*కఠిన శిక్షలు వేయాలి: డా. కాడా వెంకటరమణ, డా. ఎస్.రామకృష్ణ (ఐఎంఏ కాకినాడ)
రాజమహేంద్రవరం/కాకినాడ*(జిఎస్ బి వార్త)
వైద్య విద్యార్థిని కథ కంటతడి పెట్టిస్తోంది. రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3న రాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనలో గాయపడిన జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ డెర్మటాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
మాల్లో సినిమా చూసి స్నేహితునితో కలిసి స్కూటీపై బయటకు వస్తున్న ప్రియాంకను, మద్యం మత్తులో ఉన్న సూరావరపు ధన్వంత్, ఆండ్రూ జోసఫ్ ఎడ్వర్డ్ అనే యువకులు కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. స్కూటీ కింద పడిన ఆమెపైనుంచి వాహనాన్ని మళ్లీ ముందుకు పోనిచ్చి తొక్కించడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, మాల్ సిబ్బంది హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కిమ్స్కు తరలించారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్పై, కోమాలో చికిత్స పొందిన ఆమెకు వైద్యులు ఆప్నియా పరీక్ష నిర్వహించి బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. చివరకు శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు.గుంటూరు జిల్లాకు చెందిన ప్రియాంక తండ్రి మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు కోసమే తాను బతుకుతున్నానని, ఎంతో కష్టపడి కూతురిని డాక్టర్ను చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కోస్తాంధ్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న ఇలాంటి వ్యక్తులకు కఠినంగా శిక్ష విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ సిటీ బ్రాంచ్ డిమాండ్ చేసింది. నిందితులపై ఎలాంటి పక్షపాతం చూపకుండా సమగ్ర దర్యాప్తు జరిపి, ఉదాహరణగా నిలిచేలా కఠిన శిక్షలు వేయాలని ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడు డా. కాడా వెంకటరమణ, కార్యదర్శి డా. ఎస్.రామకృష్ణ కోరారు. రోడ్లపై బాధ్యతారాహిత్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని స్పష్టం చేశారు.కుమార్తెను కోల్పోయిన తీరని దుఃఖంలోనూ ప్రియాంక తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలించింది. ఆమె అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించారు. దీంతో మరికొందరి జీవితాల్లో ప్రియాంక మరణం వెలుగులు నింపింది. ఈ నిర్ణయాన్ని అమూల్యమైన మానవత్వానికి నిదర్శనంగా స్థానికులు, వైద్య బృందం కొనియాడారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఐఎంఏ కాకినాడ సిటీ బ్రాంచ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
