సాగర్మాల స్టార్టప్, ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత
రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు
న్యూఢిల్లీ, ఆగస్టు 11(జిఎస్ బి వార్త)
: ఆంధ్రప్రదేశ్లో సముద్ర రంగంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సాహం, పోర్ట్ కార్యకలాపాల ఆధునీకరణపై రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ కీలక వివరాలను వెల్లడించింది.కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సమాధానమిస్తూ, సాగర్మాల స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ (S2I2) ను 2025 మార్చి 19న దేశంలో సముద్ర రంగానికి సంబంధించిన ఆవిష్కరణలు, ఔత్సాహికతను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మారిటైమ్ ఇండియా ఫౌండేషన్ (MIF) ను నియమించినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమం కింద ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్పూర్, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ–చెన్నైలో మారిటైమ్ ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేసి, స్టార్టప్లకు సాంకేతిక అభివృద్ధి, పరీక్షలు, సామర్థ్య పెంపు, పైలట్ ప్రాజెక్టులు, వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు సహకారం అందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.అలాగే, MAR-a-THON పేరుతో దేశంలోనే తొలి మారిటైమ్ హ్యాకథాన్ను నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో దేశవ్యాప్తంగా స్టార్టప్ల నుంచి 330 దరఖాస్తులు అందగా, పోర్ట్ మౌలిక వసతులు, స్మార్ట్ పోర్ట్ ఆపరేషన్స్, సమగ్ర లాజిస్టిక్స్, గ్రీన్ మారిటైమ్ రంగం, భద్రత, షిప్బిల్డింగ్ వంటి ఆరు కీలక రంగాల్లో సమస్యలకు పరిష్కారాలను ఆహ్వానించారు. అనంతరం 36 స్టార్టప్లను 40 ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్టు 4 ప్రత్యేక సమస్యలను గుర్తించగా, వాటికి పరిష్కారాలు అభివృద్ధి చేసి అమలు చేసేందుకు ఏపీకి చెందిన 2 స్టార్టప్లను కార్యక్రమంలో భాగస్వాములుగా ఎంపిక చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
