ఐ . పోలవరం సెప్టెంబర్ 05 ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): గురువు అందించే జ్ఞానం జీవితానికి వెలుగునిస్తుందని, విద్యార్థి ఎదుగుదలకు ఉపాధ్యాయుడే తొలి మార్గదర్శి అని మరోసారి చాటి చెబుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో హృద్యమైన గురు–శిష్య అనుబంధానికి నిదర్శనమైన సంఘటన చోటుచేసుకుంది.
గౌరవ ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యుల దాట్ల సుబ్బరాజు తాను విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో తనకు విద్యాబోధన చేసి, జీవితంలో ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేసిన తన గురువులు వత్సవాయి పద్మనామరాజు మురమళ్లలోని వారి నివాసానికి వెళ్లి ఆత్మీయంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తన గురువుకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి గౌరవం తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తనకు విద్యాబోధన చేసిన గురువును స్వయంగా కలిసి సన్మానించడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగించిందని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు.
విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత గొప్పదని ఆయన అన్నారు. ఒక మంచి గురువు అందించే జ్ఞానం, క్రమశిక్షణ, మార్గదర్శకత్వం విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థి జీవితంపై అత్యధిక ప్రభావం చూపేది ఉపాధ్యాయుడేనని పేర్కొన్నారు.
“మన జీవితంలో మనం సాధించే ప్రతి విజయానికి వెనుక ఏదో ఒక గురువు మార్గదర్శకత్వం ఉంటుంది. అందుకే గురువుల సేవలను ఎప్పటికీ మరవకూడదు” అనే భావనతో ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన సూచించారు.
తన విద్యాభ్యాస దశలో విలువైన జ్ఞానాన్ని అందించి, మంచి మార్గంలో నడిపించిన గురువును ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్కరించడం తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు తెలిపారు.
గురు–శిష్యుల మధ్య ఉన్న అనుబంధం కాలం గడిచినా చెరిగిపోదని, గురువుకు ఇచ్చే గౌరవమే నిజమైన విద్యార్థి సంస్కారానికి నిదర్శనమని ఈ సందర్భంగా జరిగిన సన్మానం సందేశం ఇచ్చింది.


