మంత్రి లోకేష్ పర్యటనపై వైసీపీ అసత్య ప్రచారాలు
తీవ్రంగా ఖండించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్
కాకినాడ, జూలై 25:
విద్యా, ఐటీ శాఖల మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి పర్యటనపై గోకవరంలో వైసీపీ సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గోకవరం మండలం కృష్ణుని పాలెంలో మంత్రి లోకేష్ గారి కోసం విద్యార్థులు గంటల తరబడి నిరీక్షించారని, వారిని పట్టించుకోకుండా కాన్వాయ్ వెళ్లిపోయిందని వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
అసలు మంత్రి లోకేష్ గారి పర్యటన జగ్గంపేట నియోజకవర్గంలోనే లేదని, ఆయన నేరుగా రంపచోడవరం నియోజకవర్గం పర్యటనకు వెళ్లారని తెలిపారు. కృష్ణునిపాలెంలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవని అంతేకాకుండా విద్యార్థులను టీడీపీ నేతలే హడావిడిగా అక్కడికి తీసుకొచ్చారని వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. మంత్రి గారి కాన్వాయ్ ఆ మార్గం గుండా వెళుతుందని తెలుసుకుని, చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారు మాత్రమే స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారని పేర్కొన్నారు.
దీనిని వక్రీకరిస్తూ వైసీపీ నాయకులు, వారి పేటీఎం బ్యాచ్ పనిగట్టుకుని సోషల్ మీడియాలో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని నవీన్ మండిపడ్డారు. వాస్తవాలు ఇలా ఉంటే, లేనిపోని కల్పిత కథలతో ప్రజలను తప్పుదోవ పట్టేలా సోషల్ మీడియాలో చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మరని జ్యోతుల నవీన్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం ఇలాంటి అసత్య ప్రచారాలు, దిగజారుడు రాజకీయాల వల్లే వైసీపీకి ప్రస్తుత ఈ పరిస్థితి ఏర్పడిందని జ్యోతుల విమర్శించారు.

