*కాకినాడలో పారిశుధ్యంపై క్షేత్రస్థాయి తనిఖీలు తీవ్రతరం* : నిర్లక్ష్య వహిస్తే కఠిన చర్యలని కలెక్టర్, కమిషనర్ హెచ్చరిక*
కాకినాడ సిటీ జూలై 23 జి ఎస్ బి వార్త
నగరంలో పారిశుధ్యం, మౌలిక వసతుల నిర్వహణను మరింత మెరుగుపరచేందుకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం క్షేత్రస్థాయి తనిఖీలను ముమ్మరం చేసింది. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ గురువారం ఉదయం 4వ డివిజన్లోని వెంకట్నగర్ సాయిబాబా గుడి సెంటర్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయ వీధి వరకు స్వయంగా పర్యటించి పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. శానిటేషన్ విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ కూడా తీవ్రంగా హెచ్చరించారు. బాబా గుడి పరిసరాల్లో పేరుకుపోయిన రోడ్డు వ్యర్థాలను వెంటనే తొలగించి, ఫోటోలతో నివేదిక ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. వీధి దీపాలు వెలగని ప్రాంతాలను గుర్తించి వెంటనే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ విభాగాన్ని ఆదేశించారు. ‘పురమిత్ర’ యాప్ లేదా అధికారులకు ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిలటరీ రోడ్డులో తాగునీటి పైప్లైన్ లీకేజీని గుర్తించి, వాటర్వర్క్స్ అధికారుల ద్వారా తక్షణమే మరమ్మతులు చేపట్టించారు. ఖాళీ స్థలంలో చెత్త వేసిన స్థల యజమానికి నోటీసు జారీ చేసి, శుభ్రపరిచే ఖర్చును వారి నుంచే వసూలు చేయాలని స్పష్టం చేశారు.హోటల్ యజమానికి జరిమానా: రోడ్డుపై ఆహార వ్యర్థాలు వేసి దుర్వాసనకు కారణమైన ఒక హోటల్ యజమానికి రూ.500 జరిమానా విధించారు.
డ్రైన్లలో పూడిక తీత పూర్తి చేయాలని, దోమల వ్యాప్తి చెందకుండా నిరంతరం యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే నగరంలో అక్రమ పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్, అధికారులకు కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు:
ఉదయం తనిఖీలు తప్పనిసరి: శానిటరీ సెక్రటరీలు ప్రతిరోజూ ఉదయం 6:00 నుండి 9:00 గంటల వరకు క్షేత్రస్థాయిలో ఉండి ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల నిర్వహణను స్వయంగా6 పర్యవేక్షించాలి. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.నగర పరిశుభ్రతలో ప్రజలు కూడా భాగస్వాములై చెత్తను రోడ్లు, ఖాళీ స్థలాల్లో వేయకుండా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వి చరణ్, వాటర్వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, 4వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి వడిసెలు దాలమ్మ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
