*టీడీపీ సభ్యత్వంతో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల భరోసా* :
*మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి*
కాకినాడ రూరల్ జూలై 23 జి ఎస్ బి వార్త
ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా టిప్పర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందిన చీడిగ గ్రామానికి చెందిన కాదా చిట్టెమ్మ, మట్టపర్తి అరుణ కుమారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం అందింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున, మొత్తం రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కులను కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు బాధిత కుటుంబాలకు నేరుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మృతులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావడంతో, ఆ వివరాలను వెంటనే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని వారు కొనియాడారు. కేవలం రూ.100తో తీసుకున్న టీడీపీ ప్రాథమిక సభ్యత్వం ద్వారానే ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు ఈ విధంగా రూ.5 లక్షల చొప్పున ఆర్థిక భరోసా లభించిందని, ఇది పార్టీకి ఉన్న కార్యకర్తల సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పలువురు టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
