ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..
ముందస్తు చర్యలతో పూర్తిస్థాయిలో సిద్ధమైన జిల్లా యంత్రాంగంభద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి నీటిమట్టం.
అమలాపురం, ఆగస్టు 1, (జిఎస్ బి వార్త):
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి పేర్కొన్నారు. శనివారం స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు సమాచార పౌర సంబంధాల శాఖ అధికా రి సిహెచ్ శ్రీనివాస్ తో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే పరిణామమని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు 56.1 అడుగులుగా నమోదైన నీటిమట్టం సాయంత్రం 4 గంటలకు 55.5 అడుగులకు తగ్గినట్లు వెల్లడించారు.జిల్లాలో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలియజేశారు. పి.గన్నవరం మండలంలోని నాలుగు గ్రామాలు గాను హాబిటేషన్లకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న సుమారు 310 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ముందుగానే అందుబాటులో ఉంచామని తెలిపారు.అత్యవసర సహాయక చర్యల కోసం రెండు పడవలు, 45 మంది శిక్షణ పొందిన గజ ఈతగాళ్లు, తగినన్ని లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచామని, పోలీసు, వైద్య ఆరోగ్య, విద్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు డివిజన్ మండల స్థాయి అధికారులతోపాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని జె సి తెలిపారు.రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, మండల స్థాయి అధికారులను కాజ్వేలు, ఏటిగట్టు వద్ద అప్రమత్తంగా ఉంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.వరదలకు సంబంధించిన సమాచారం, అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 08856-293104,ప్రజలు రాబోయే ఒకటి, రెండు రోజుల పాటు పొంగిపొర్లుతున్న వాగులు, వంతెనలు, కాజ్వేలు, నీట మునిగిన ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. వరద నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని సూచించారు. పశువుల కాపరులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరదలు ఉధృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగం చెప్పిన సూచనలు పాటించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారుఅత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 08856-293104ను సంప్రదించాలని కోరారు.



