కాకినాడ సిటీ ఆగస్టు 27 జి ఎస్ బి వార్త
కాకినాడలోని ప్రముఖ సీబీఎం జూనియర్ కాలేజ్ ఫర్ ఉమెన్ను కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ రాంబాబు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు,విద్యార్థినులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఐఇఒ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ… పూర్వకాలం నుండి సీబీఎం కళాశాల అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తూ వస్తోందని కొనియాడారు.ఈ కళాశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు విద్యావంతులై నేడు సమాజంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారని తెలిపారు. కాకినాడలోని అత్యున్నతమైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఈ కళాశాలలో సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ తరఫున కళాశాల అభివృద్ధికి
ఏవిధమైన సహకారం కావాలన్నా పూర్తిస్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చారు.
కళాశాల కరస్పాండెంట్, సిబిసిఎన్సి భారత్ బిషప్ డాక్టర్ ఎం. రత్న కుమార్ మాట్లాడుతూ… తమ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా 245 పాఠశాలలు, 78 కళాశాలలు మరియు 8 ఆసుపత్రుల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి వంటి మహనీయులు తమ సీబీఎం సంస్థలోనే విద్యాభ్యాసం చేశారని, నేడు అనేక ఉన్నత పదవుల్లో ఉన్న ప్రముఖులు కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థులేనని గర్వంగా వెల్లడించారు.
కళాశాల ప్రిన్సిపల్ క్రాంతి రేఖ మాట్లాడుతూ తమ కళాశాల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని తెలిపారు. అత్యున్నత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడూతూ ఈ కళాశాలలో చదువుకోవడం ద్వారా తాము సాధించిన ప్రగతిని, నేర్చుకున్న విషయాలను ముఖ్య అతిథి డాక్టర్ రాంబాబుతో పంచుకున్నారు.
అనంతరం కాకినాడ జిల్లా డిఐఇఒ ఇడాక్టర్ రాంబాబు ని కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం ఘనంగా సత్కరించాయి.ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది.
