.కరప (జిఎస్ బి వార్త)
కరప మండలంలో శహాపురం డ్రెయిన్ పనులను మంగళవారం ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు.పంటలకు వరద ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకువాలని అధికారులను ఆదేశించారు .కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఐదవ పంట కాలంలోనూ “ఒక ఎకరం నీరు తడారకూడదు! ఒక ఎకరం మునిగిపోకూడదు!” అనే నినాదంతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు కలిసికట్టుగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
మంగళవారం కరప మండలంలోని శహాపురం డ్రెయిన్ ను గొర్రిపూడి తుల్యభాగాను కలిసే మురికి కాలువతో పాటు కొంగోడులో నిలిచిపోయిన బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పొలాలకు సాగునీరు అందించడంతో పాటు వరద ముప్పు నుంచి పంటలను కాపాడేందుకు సొంత ఖర్చులు, స్థానిక ఇరిగేషన్ నిధులు, అత్యవసర గ్రాంట్లతో యుద్ధప్రాతిపదికన కాలవల పూడికతీత, మరమ్మతు పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. అనేక నియోజకవర్గాల నుంచి వచ్చే మురుగు నీరు ప్రవహించే శహాపురం డ్రెయిన్ పూడికపోవడం వల్ల కరప, వేములవాడ, కొంగోడు, వలసపాకల, పేపకాయలపాలెం, కూరాడ, వాకాడ తదితర గ్రామాల ఆయకట్టు తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే వివరిస్తూ, గతంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణలకు గురైన డ్రెయిన్ పరిధిని పునరుద్ధరిస్తున్నామన్నారు. డీసీ ఛైర్మన్ (పీజీ) పుణ్యమంతుల గంగ సత్యనారాయణ , ఇతర నీటి సంఘాల అధ్యక్షులఆధ్వర్యంలో వారం రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించి డ్రెయిన్ తవ్వకం పనులను పూర్తి చేశామని తెలిపారు.
రైతుల రాకపోకలకు అనువుగా డ్రెయిన్ గట్టుపై గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఆక్రమణలు తొలగించే ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. సుమారు కిలోమీటరున్నర పరిధిలో అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, షెడ్లను 15 రోజుల్లోగా తొలగించాలని ఆదేశించామని, రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. గత నాలుగు పంటల్లోనూ సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఆర్థిక నిలకడ చేకూర్చామని, సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లలో సిరులు కురిపించడమే తమ ప్రధాన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
